ద్వారకాతిరుమల: శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ రెండో శనివారం కావడంతో చిన్నతిరుపతి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్ధం ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. 140 జంటలు శ్రీవారి నిత్యార్జిత కల్యాణంలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు స్వామి వారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే అనివేటి మండపంలో పలు భజన మండళ్ల సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి.
పాలకొల్లు సెంట్రల్: పెళ్లి వేడుకకు వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతుల్లో భార్య మెడలో ఉన్న బొందును లాక్కెళ్లిన సంఘటన మండలంలోని దిగమర్రు గ్రామంలో బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పాలకొల్లు మండలంలోని వరిదనం గ్రామానికి చెందిన గూడూరి భార్గవి, భర్త ప్రేమ్ సాయిలు శుక్రవారం రాత్రి నరసాపురం మండలంలోని ఎల్బీ చర్ల గ్రామంలో బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. తిరిగి రాత్రి 10 గంటల సమయంలో తమ ఇంటికి వస్తుండగా దిగమర్రు బైపాస్ మారుతి సుజికి షోరూమ్ వద్దకు వచ్చే సరికి ఇద్దరు వ్యక్తులు వారి వెనుకే వస్తూ ద్విచక్ర వాహనంపై వెళ్లి భార్గవి మెడలో ఉన్న నాలుగు కాసులు తాళిబొట్టు, కాసు చైన్ లాక్కుని పారిపోయారు. గొలుసు లాగడంతో భార్యాభర్తలు వాహనంపై నుంచి పడిపోయారు. ప్రమాదంలో భార్యకు ఎడమ చేతిపై గాయమైంది. బాధితురాలు భార్గవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.


