
రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి
భీమవరం: రైలు నుంచి జారిపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు రైల్వే ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈనెల 16వ తేదీన ఆకివీడు – ఉండి రైల్వే స్టేషన్ మధ్య 55 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి గాయపడడంతో చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా భీమవరం ప్రభుత్వాసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. అక్కడ ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు సెల్ 99084 48729 నంబర్లో సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
దెందులూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడి గ్రామంలో కంచర్ల తంబి (40) చేపల చెరువులపై గుమస్తాగా పనిచేస్తున్నాడు. గురువారం ఇంటి వద్దనే మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. గమనించిన బంధువులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
ఎరువుల పట్టివేత
లింగపాలెం: మండలంలోని యడవల్లి గ్రామ సమీపంలో 7 టన్నుల కాంప్లెక్స్ ఎరువులను వ్యాన్లో అక్రమంగా తరలిస్తుండగా వ్యవసాయశాఖ డీఏఓ ఎస్కే అబీబ్ బాషా, ఏడీఏ వై సుబ్బారావు, ఏవో వి ప్రదీప్ కుమార్ పరిశీలించి సీజ్ చేశారు. వీటి విలువ రూ.2 లక్షల 6 వేలు అని తెలిపారు. కృష్ణా జిల్లా మైలవరం నుంచి ఈ ఎరువులను తరలిస్తున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఎరువులను మఠంగూడెం సొసైటీలో భద్రపర్చి, వ్యాన్ను పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఏవో ప్రదీప్ కుమార్ విలేకర్లకు తెలిపారు.
గురుకుల ఉపాధ్యాయుడికి పురస్కారం
నరసాపురం రూరల్: ఎల్బీచర్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల గణిత ఉపాధ్యాయుడు బేతపూడి విజయ్కిరణ్ కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాహుల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంస్కృతుల ప్రోత్సాహంపై ఈ నెల 9 నుంచి 29 వరకూ హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్కిరణ్ ‘ఆంధ్రప్రదేశ్లో చేతి వృత్తుల కళాకారుల జీవన స్థితిగతులు’ అనే అంశంపై ప్రాజెక్టు సమర్పించారు. ఈ ప్రాజెక్టుకుగాను కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఆయనకు ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.శ్యాంప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ పి.మార్క్, నల్లి సాయిబాబు, రాజా, పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయుడు విజయ్కిరణ్ను అభినందించారు.

రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి