● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి
పరకాల: పిల్లకాకి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. శనివారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డివిజన్ పరిధిలోని నడికూడ, ఆత్మకూరు, దామెర, పరకాల మండలాల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్కార్డులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు పంపిణీ చేయలేదన్నారు. పరకాల నియోజకవర్గంలో 88,384 స్మార్ట్ రేషన్కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పరకాల సభలో ప్రజలు చూపించిన అపూర్వమైన స్పందనను చూసి కొందరు ఓర్వలేక తన మీద అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తన పనితనం చూసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనకు మరోసారి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించడాన్ని కొందరు జీర్ణించుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పరకాల నియోజకవర్గ అభివృద్ధికి మరింత పట్టుదలతో పనిచేస్తానని స్పష్టం చేశారు. అదేవిధంగా స్థానిక రాజిపేటలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు నాణ్యతతోపాటు వేగంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, శ్రీకుంకుమేశ్వరస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్రావు, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు పాల్గొన్నారు


