హన్మకొండ అర్బన్: గౌరవెల్లి కాలువ, గ్రీన్న్ ఫీల్డ్ జాతీయ రహదారి, దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో రెవెన్యూ, సాగు నీటిపారుదల, జాతీయ రహదారుల శాఖ అధికారులతో భూసేకరణ, పరిహారం చెల్లింపులపై సమీక్ష నిర్వహించారు. వేలేరు, భీమదేవరపల్లి, ధర్మసాగర్ మండలాల్లో గౌరవెల్లి కాలువకు సేకరిస్తున్న భూముల్లో పెగ్ మార్కింగ్ పనులు సర్వేయర్లతో త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులకు పరిహారం చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పరకాల నియోజకవర్గంలోని గ్రీనన్ ఫీల్డ్ జాతీయ రహదారి, ఆర్ఓబీలకు సంబంధించిన భూసేకరణను వేగవంతం చేయాలన్నారు. భూభారతి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న భూముల రీసర్వేను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఆర్డీఓలు వెంకటేశ్, డీఎస్.వెంకన్న, జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ్, సాగునీటిపారుదల శాఖ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


