హాట్ హాట్గా మిర్చి
డిమాండ్ ఎందుకు ఎక్కువంటే..
● రోజురోజుకూ పెరుగుతున్న
దేశీ, వండర్హాట్ ధరలు
● ఇతర రకాల మిరపకు సైతం
మార్కెట్లో డిమాండ్
● దేశీ మిర్చికి అత్యధికంగా
క్వింటాకు రూ.50,000
● జనవరి నుంచి
ఇప్పటివరకు
1,27,200
క్వింటాళ్ల విక్రయాలు
అత్యధిక ధర పలికిన
దేశీ మిర్చి (ఫైల్)
సాక్షి, వరంగల్: వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు హాట్ హాట్గా ఉంటున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని రకాల మిర్చికి ధర రోజురోజుకు పెరుగుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు తాజాగా దేశీ మిర్చి క్వింటా రూ.50,000లు పలకడంతో మిర్చి ధరలపై మరోసారి చర్చ జరుగుతోంది. మూడు రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూల్లూరుపల్లికి చెందిన రవీందర్రావు తొమ్మిది బస్తాల దేశీ మిర్చిని తీసుకురావడంతో అడ్తి శాంతి ఇండస్ట్రీస్ అమ్మించగా రూ.50,000లు ధర పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి సాగు విస్తీర్ణం తగ్గి, అకాల వర్షాలతో పంట దెబ్బతినడంతో ఉన్న మిర్చికే రేటు అధికంగా పలుకుతోందని, అదే సమయంలో ఆయా మిర్చి కారం, నాణ్యతను బట్టి పరిశ్రమలు ఎక్కువ ధరకు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తుండడం కూడా రేటు పెరగడానికి మరో కారణంగా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. మిర్చి నాటే సమయానికి కురిసిన భారీ వర్షాలకు భారీగానే పంట దెబ్బతింది. ఉన్న పంటలోనూ ఆశించిన స్థాయిలో పంట రాకపోవడంతో మార్కెట్కు మిర్చి రావడం తగ్గింది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది. గృహ అవసరాలకు వినియోగం పెరగడం, మార్కెట్కు మేలు రకమైన మిర్చి వస్తుండడంతో వ్యాపారస్తులు పోటీపడి కొంటున్నారు. దీంతో మిర్చికి ధర పలుకుతోంది. ఆయా మిర్చి నాణ్యతను బట్టి రూ.15 వేల నుంచి రూ.50,000ల వరకు ధర వస్తోంది.
మిర్చి ధరలు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ సీజన్లో అన్ని రకాల మిర్చికి కాస్త ఎక్కువగానే ధర పలుకుతోంది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఇప్పటివరకు 3,18,020 బ్యాగులు ఎనుమాముల మార్కెట్కు వచ్చాయి. మొత్తంగా 1,27,200ల క్వింటాళ్ల విక్రయాలు జరిగాయి. రాబోయే రోజుల్లో ఇంకా మిర్చి రాక పెరుగుతుంది.
– మల్లేశం, కార్యదర్శి,
ఎనుమాముల మార్కెట్
దేశీ రకం మిర్చి పంట ఉత్పత్తి చాలా తగ్గింది. అకాల వర్షాలు, తామర తెగులుతో దిగుబడి పడిపోయింది. అదే సమయంలో ఈ మిర్చిని ఎక్కువగా పచ్చళ్లలో వాడుతుండడం, ఇప్పుడూ సీజన్ కూడా కావడంతో ఉన్న కొద్దిపంటకు అత్యధిక ధర పలుకుతోంది. నాణ్యత ఉన్న మిర్చిని ఖరీదుదారు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. 2022 మార్చి 30న ఈ దేశీ రకం మిర్చి క్వింటాకు అత్యధికంగా రూ.52వేల ధర పలికిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
సింగిల్ పట్టి మిర్చిని ఎక్కువగా పచ్చళ్లకు వినియోగిస్తున్నారు. కారం తక్కువగా, రంగు బాగా ఉండడం, ఘాటు ఉండకుండా టేస్టీగా ఉండడంతో దీనికి డిమాండ్ ఏర్పడింది. ఈసారి అత్యధికంగా రూ.35,000లకు అమ్ముడుపోయింది. 2022 మార్చి 10న అత్యధికంగా క్వింటాకు రూ.42 వేల ధర పలికిందని మార్కెట్ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఆకుపచ్చ, లేదంటే ఎర్రగా లేదంటే పొడిగా ఉండే యూఎస్ 341 మిర్చిని పంజాబ్లో ఎక్కువగా డిమాండ్ ఉంది. ఇందులో కారంస్థాయి సమంగా ఉన్నందున తయారీకి అనుకూలంగా ఉంటుంది.
వండర్హాట్ మిర్చిలో కారం ఎక్కువ శాతం ఉంటుంది. పచ్చడి, పొడి మసాలా తయారీలో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. విదేశాల్లో ఉన్న మసాలా పరిశ్రమలు ఈ మిర్చికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. గాడ ఎరుపు రంగులో మెరిసేతత్వం ఉంటుంది. మంచి డ్రైయింగ్ క్వాలిటీ ఉండడంతో ఖరీదుదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. యల్లో మిర్చి, దీపిక, 1048, తేజ మిర్చికి కూడా స్థానిక పరిశ్రమలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది.
హాట్ హాట్గా మిర్చి


