కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత ఇవ్వాలి
కాజీపేట రూరల్: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలివ్వడంలో, కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రం చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్రావు అన్నారు. కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ‘కోలువుల కోసం కోట్లాట’ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. హరీశ్రావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పోరాటం, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు 50 ఏళ్ల కృషి ఫలితంగానే కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. ‘కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధమవుతోందని, కానీ, కోచ్ఫ్యాక్టరీలో అసలు కోచ్లు తయారవుతాయా? వ్యాగన్లు తయారవుతాయా? అసలు ఎంత మందికి ఉద్యోగాలిస్తారు? భూమి ఇచ్చిన అయోధ్యపురం గ్రామస్తులకు ఎన్ని ఉద్యోగాలు, స్థానికులకు ఎన్ని ఇస్తున్నారో తేల్చి కేంద్రం గెజిట్ ఇవ్వాలి’ అని అన్నారు.
స్థానికులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలి..
కేంద్రం లాతూర్, అస్సాం కోచ్ ఫ్యాక్టరీలో మాదిరి ఇక్కడ కూడా స్థానికులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే ప్రారంభోత్సవానికి వచ్చే బీజేపీ మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఒప్పించాలన్నారు. ఏపీలో విశాఖ రైల్వే జోన్ చేసినట్లు, కాజీపేట డివిజన్గా చేయాలని అందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఎంపీలు ప్రధాని మోదీతో మాట్లాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మట్లాడుతూ.. రైల్వే కోచ్ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం కాజీపేట నుంచి ఢిల్లీ వరకు దశల వారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు టి.రాజయ్య, అరూరి రమేశ్, శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డి నాయకులు పాల్గొన్నారు.
కాజీపేటను రైల్వే డివిజన్ చేసేవరకు పోరాడుతాం
స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే ఉద్యమం ఉధృతం..
‘కొలువుల కోసం కొట్లాట’లో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు


