పోలీసులు పట్టించుకోవట్లేదని రాస్తారోకో
ఎల్కతుర్తి: భూ తగాదాలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తమకు న్యాయం చేయాలని వస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన పలువురు బాధితులు శనివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా–రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించిపోయాయి. తమకు న్యాయం జరిగేవరకు ధర్నాను విరమించేది లేదని భీష్మించుకుని రోడ్డుపై కూర్చున్నారు. పోలీసులు, పలువురు నాయకుల జోక్యంతో ధర్నాను విరమించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన కస్తూరి ప్రమీల భర్త సారయ్య. వారు నలుగురు అన్నదమ్ములు. కాగా, 532 సర్వేనంబర్లో 35 గుంటలు ఉమ్మడి ఆస్తి ఉంది. కొమురయ్య (వరుసకు బావ) అనే వ్యక్తి ఎవ్వరికీ తెలియకుండా పట్టా చేసుకున్నాడు. దీనిపై కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మార్చి 1న (ఆదివారం) నాడు పంచాయితీ పెట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు 568, 569 సర్వే నంబర్లో వారసత్వ భూమి గురించి చర్చిస్తే వారి తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతో కావాలనే గొడవ తయారు చేసి కొమురయ్య, వారి కుటుంబ సభ్యులు కలిసి మూకుమ్మడిగా ఈనెల 27న తమ ఇంట్లోకి అక్రమంగా చోరబడి కట్టెలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తమ కుటుంబసభ్యులకు తీవ్ర గాయాలైనట్లు బాధితులు తెలిపారు. అంతేకాకుండా మూడు తులాల వెండి, తులం పుస్తెలు, పాకెట్లో ఉన్న రూ.20 వేలు పోయినట్లు తెలిపారు. అదేవిధంగా ఇంట్లో దాచిన రూ.4.80 లక్షలు పోయినట్లు పేర్కొన్నారు. తమపై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాల ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు వస్తే తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు రహదారిపై ధర్నా నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దాదాపు సుమారు 20 మంది బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
భూ తగాదాలో పలువురికి గాయాలు
హనుమకొండ–కరీంనగర్ ప్రధాన
రహదారిపై ట్రాఫిక్ జాం


