జాతీయస్థాయి అవార్డు రావడం గర్వకారణం
ముల్కనూరు మహిళా సహకార డెయిరీ
అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ
భీమదేవరపల్లి: మండలంలోని ముల్కనూరు మహిళా సహకార డెయిరీకి ప్రతిష్టాత్మకమైన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) వారి రీజినల్ కోఆపరేటివ్ ఎక్సలెన్స్ అవార్డు–2025 లభించడం గర్వకారణమని డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ అన్నారు. హైదరాబాద్లో గురువారం ఆమె అందుకుని మాట్లాడారు. సహకార రంగంలో విశిష్ట సేవలు, పారదర్శక నిర్వహణ, మహిళా సాధికారతలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించినట్లు తెలిపారు. పాలసేకరణ పెరుగుదల, సభ్యుల సంఖ్య విస్తరణ, ఆధునిక సాంకేతిక పద్ధతుల అమలు, మహిళా రైతులకు సమయానికి చెల్లింపుల వంటి అంశాల్లో డెయిరీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. డైయిరీ ప్రతినిధులు రవీందర్, మహిళలు పాల్గొన్నారు.


