వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి
నర్సంపేట: వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్యవాదులకు, బడా కార్పొరేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం అప్పగించకుండా పోరాటాలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆరోపించారు. ఏఐకేఎంఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు బుధవారం పట్టణంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఇటీవల నూతన విత్తన చట్టం బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను తీసుకొచ్చిందన్నారు. బిల్లు ఆమోదం పొందితే రైతులు విత్తన ఉత్పత్తి చేసే హక్కును కోల్పోతారని, బహుళజాతి కారొపరేట్ సంస్థలు తయారు చేసిన విత్తనాలు, క్రిమిసంహారక మందులు వాడడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేట్ పరమవుతుందన్నారు. విద్యుత్ మీటర్లకు రీచార్జ్ చేసుకునే విధానం తీసుకొస్తుందని తెలిపారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నిర్వహించే ఆందోళనల్లో పాల్గొనాలని తెలిపారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న మాట్లాడుతూ 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గట్టి కృష్ణ, బొమ్మెడ సాంబయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కుల తిరుపతి, సారంగపాణి, శ్యామల రమేష్, బీమగాని మల్లన్న, మాచర్ల విజయ్, కొంపెల్లి సాంబయ్య పాల్గొన్నారు.


