తూము నిర్మాణానికి స్థలపరిశీలన
దుగ్గొండి: మండలంలోని కంచర్లచెరువులోకి ఎస్సారెస్పీ నీటిని తరలించడానికి సాగునీటిశాఖ అధికారులు బుధవారం స్థల పరిశీలన చేశారు. కంచర్లచెరువు కింద భూములు కలిగిఉన్న మల్లంపల్లి, చంద్రయ్యపల్లి, బల్వంతాపురం, బొబ్బరోనిపల్లి గ్రామాల రైతులు నీరు లేక భూములు సాగుచేసుకోలేకపోతున్నారు. ఈసారి రైతులు వరిసాగు చేయగా నీరుసరిపడా లేక ఎండిపోయే ప్రమాదం వచ్చింది. దీంతో రైతులంతా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విషయం తెలియజేశారు. స్పందించిన ఆయన పరిశీలన చేయాలని సాగునీటిశాఖ అధికారులకు సూచించారు. దీంతో ఎస్ఈ స్వామి ఎస్సారెస్పీ డీబీఎం –38 కాల్వకు చెందిన 14ఎల్ ఉపకాల్వకు తూము ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా తూము ఏర్పాటు చేసి ఎస్సారెస్పీ నీరు కంచర్ల చెరువులోకి వచ్చేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సాగునీటిశాఖ ఈఈ సుదర్శన్, డీఈ రామకృష్ణ, ఏఈ పవిత్ర, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క రమేష్, సర్పంచ్ బూర రాధిక–చందుగౌడ్, రైతులు ఎర్ర ఆదిరెడ్డి, ఎండీ సర్వర్, కక్కెర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.


