ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్
కాళోజీ సెంటర్: ఈనెల 25 నుంచి జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలను బోర్డు నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లతో హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సుల్లో 5,210 మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల్లో 793 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సుల్లో 5,356 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 807 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే టోల్ఫ్రీ నంబర్ 92402 05555కు ఫోన్ చేయాలని సూచించారు. డీఈసీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మల పాల్గొన్నారు.


