టెన్త్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి
● కలెక్టర్ సత్యశారద
కాళోజీ సెంటర్ : జిల్లాలో టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఉత్తీర్ణత శాతం పెరిగేలా కృషి చేయాలని కలెక్టర్ సత్యశారద ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. డీఈఓ రంగయ్యనాయుడు అధ్యక్షతన గురువారం కలెక్టరేట్లో ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఎఫ్ఆర్ఎస్ తప్పనిసరి అమలు చేయాలని, ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ రోజువారీగా నివేదికలు స్క్రూటినీ చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సబ్జెక్టు వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించి ఈ విద్యసంవత్సరం ఉత్తీర్ణత పెంచేందుకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు కృషిచేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మొత్తం 288 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, వీటిల్లో పదో తరగతి చదువుతున్న 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు.
పీఎం శ్రీ స్కూళ్ల పనులు పూర్తి చేయాలి
జిల్లాలోని 16 పీఎంశ్రీ స్కూళ్లలోని విద్యార్థుల అవసరాలకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ను ప్రణా ళికబద్దంగా ఖర్చు చేసి స్కూల్స్ను ఆధునికీకరించాలని కలెక్టర్ సత్యశారద ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. ఇంజనీరింగ్ పనులు పెండింగ్ ఉంటే పూర్తి చేయాలని టీడబ్ల్యూఈఐడీసీ ఈఈ అరుణ్కుమార్ను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్ ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి గారే కృష్ణమూర్తి, ఏఎంఓ ఉండ్రాతి సుజన్తేజ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ అరుణ, జీసీడీఓ ప్లోరెన్స్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ కట్ల శ్రీనివాస్, ప్లానింగ్ ఆఫీసర్స్ విజయ్కుమార్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అవగాహన కల్పించాలి
న్యూశాయంపేట: మిర్చి నాణ్యతపై రైతులకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మిర్చి సీజన్ ప్రారంభ నేపథ్యంలో ఏనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి రాబడులు, నాణ్యత, ధరల పరిస్థితిపై గురువారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధరలు నమోదు అవుతున్నప్పటికీ తేమతో కూడిన మిర్చి తీసుకురావడం వల్ల రంగు మారి నాణ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. దీంతో ఇతర రాష్ట్రాలు, విదేశీ వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపడంలేదన్నారు. రైతులు ధర కోల్పోకుండా నాణ్యతపై దృష్టిపెట్టాలని కలెక్టర్ సూచించారు. సమీక్షా సమావేశంలో డీఏఓ అనురాధ, హార్టీకల్చర్ అధికారి శ్రీనివాస్రావు, మార్కెటింగ్ అధికారి సురేఖ, మార్కెట్ కమిటీ కార్యదర్శి మల్లేషం, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు రవీందర్రెడ్డి, వేద ప్రకాశ్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.


