బడిబయటే బాల్యం!
జిల్లాలో ముగిసిన ఓఎస్సీ సర్వే
అమరచింత: జిల్లాలో బడిబయటి పిల్లల సంఖ్య తగ్గడం లేదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా వారి సంఖ్య అధికంగానే ఉంది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ మండలాల్లోని సీఆర్పీలు 40 రోజుల పాటు సర్వేచేసి విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు పాఠశాలకు వెళ్లని 15 నుంచి 19 ఏళ్లలోపు వారిని గుర్తించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు, అవగాహన లేమి కారణంగా జిల్లాలో 431 మంది చిన్నారులు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. వారిని స్థానిక పాఠశాలలు లేదా కస్తూర్బా, గురుకులాల్లో చేర్పించే చర్యలు చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
సర్వే కొనసాగింది ఇలా..
చదువుకోవాల్సిన వయసులో వీధుల్లో ఉంటున్న వారి వివరాలను రెండు గ్రూప్లుగా వర్గీకరించారు. 6 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులు ఒక గ్రూప్గా.. 15 నుంచి 19 ఏళ్లలోపు బాలబాలికల మరో గ్రూప్గా విభజించి సేకరించిన వివరాలను ప్రబంద్ యాప్లో నిక్షిప్తం చేశారు. విద్యాసంస్థలు తెరిచాక వయస్సు ఆధారంగా ఆయా తరగతుల్లో చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
బడిబయటి పిల్లలను గుర్తించిన అనంతరం వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అందుబాటులో ఉండే పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అంతేగాకుండా బాలురు, బాలికలకు వేర్వేరుగా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్ఎస్), స్పెషల్ ట్రైనింగ్ సెంటర్(ఎస్టీసీ), సర్వేలో మైగ్రేటెడ్ (వలస పిల్లల కోసం) రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైనింగ్ సెంటర్లు (ఆర్ఎస్టీసీ) ఏర్పాటు చేసి బడిబయటి పిల్లలకు విద్యను అందించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. ఇవేగాకుండా ఇటుక బట్టీలు, కర్మాగారాల వద్ద పనిచేస్తున్న కార్మికుల పిల్లల కోసం వర్క్సైట్ స్కూల్స్ ఏర్పాటు చేసి అక్కడే విద్యనందించేందుకు యాజమాన్యాల సహకారంతో 14 ఏళ్లలోపు విద్యార్థులకు ఏర్పాటు చేస్తారు.
తూతూమంత్రంగానేనా..?
బడిబయటి పిల్లల గుర్తింపు సర్వే నవంబర్ 15న ప్రారంభించి డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కాగా డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో సర్వే నామమాత్రంగా సాగింది. జనవరి రెండోవారం నాటికి ఆన్లైన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా పర్యవేక్షించే అధికారి లేకపోవడంతో ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా వివరాల నమోదు పూర్తి కాలేదు. చాలామంది సీఆర్పీలు తమకు కేటాయించిన క్లస్టర్ గ్రామాల్లో పర్యటించకుండానే బడిమానిన విద్యార్థుల వివరాలు నామామాత్రంగా తెలుసుకొని నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జనవరి 20 నుంచి 40 రోజుల పాటు కొనసాగింపు
బడిబయటి విద్యార్థులు 431
గతంలో కంటే పెరిగిన సంఖ్య
నిర్బంధ విద్య అందిస్తామంటున్న అధికారులు
బడిబయటే బాల్యం!


