పోరాటం ఆపొద్దు..! | - | Sakshi
Sakshi News home page

పోరాటం ఆపొద్దు..!

Feb 26 2026 9:33 AM | Updated on Feb 26 2026 9:33 AM

పోరాటం ఆపొద్దు..!

పోరాటం ఆపొద్దు..!

పాప చనిపోతే హత్య కేసు కాదా?

మానవత్వానికి మాయని మచ్చగా

దాడి ఘటన

రెండు నెలల పసిపాపపై ఇంత

క్రూరత్వమా?

ఒక్క వ్యక్తిపై 20 మంది దాడి చేయడం సిగ్గుచేటు

‘కుమ్మెర’ బాధిత కుటుంబాన్ని

పరామర్శించిన కేటీఆర్‌

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో ఓ కుటుంబం పట్ల పైశాచికంగా ప్రవర్తించిన మానవ మృగాలను శిక్షించే వరకు పోరాటం ఆపొద్దని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్నారు. బాధిత కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బుధవారం ఆయన నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులు చంద్రకళ, గణేశ్‌, మౌనికతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంఘటన చోటుచేసుకున్న వెంటనే స్పందించి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్న విశారదన్‌ మహరాజ్‌ పోరాటాన్ని అభినందించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, హంతకులందరికీ శిక్ష పడే దాకా పోరాటాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పారు.

పోలీసులను డిస్మిస్‌ చేయాలి

కుమ్మెర దాడి ఘటనలో బాధితుల ఫిర్యాదు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బాధ్యులైన వారిని సస్పెండ్‌ కాకుండా డిస్మిస్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పోలీసింగ్‌కు అంతర్జాతీయంగా పేరు తీసుకొస్తే.. కాంగ్రెస్‌ హయాంలో వ్యవస్థను నీరుగార్చారని మండిపడ్డారు. నిందితులందరిపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు.

ఆధిపత్యం, అహంకారంతోనే..

అగ్రకులాల ఆధిపత్యం, అహకారంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. కుమ్మెరలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పారు. ఇక్కడి పరిస్థితులు, ఇలాంటి ఘటనల నుంచే తాను పాటలు పాడానని గుర్తుచేశారు. ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని విమర్శించారు.

ఐదోరోజు కొనసాగిన నిరసనలు

కుమ్మెరలో దాడి ఘటనపై జిల్లాకేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన శిబిరంలో బుధవారం ఐదోరోజు ఆందోళనలు కొనసాగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతోపాటు రాష్ట్ర రజక సంఘం నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. అలాగే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో శ్రేణు లు నిరసన శిబిరం వద్దకు చేరుకున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాక సందర్భంగా అంబేడ్కర్‌ చౌరస్తా ప్రాంతం కిక్కిరిసి ఉండటంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

సామరస్యానికి ప్రతీక ఈ ప్రాంతం..

ఇక్కడి ప్రాంతం కుల, మతాల సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మహేంద్రనాథ్‌తోపాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న లాంటి ప్రజా కవులు ఇక్కడి ప్రాంత సామరస్యం కోసం కృషిచేశారని చెప్పారు. కులాలు, మతాల పిచ్చి వదిలి.. సామాజిక చైతన్యం కావాలన్నారు. మానవ మృగాలకు శిక్ష పడేందుకు అందరం ఏకమవ్వాలని చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్టు ప్రకటించారు.

బాధితులకు న్యాయం జరిగే దాకా అండగా నిలబడదాం

కుమ్మెర ఘటనలో నిరుపేద కుటుంబంపై దాడికి పాల్పడటం అధికార దురహంకారానికి నిదర్శనమని కేటీఆర్‌ అన్నారు. ఒక్క వ్యక్తిపై 20 మంది కలిసి దాడి చేయడం, పసిపాప అని కూడా చూడకుండా కాలితో తన్నడం మానవత్వానికే మచ్చగా మిగిలిందని విమర్శించారు. ఇలాంటి ఘటనపై ప్రజలంతా స్పందించాలని, మనసున్న మనుషులంతా ఏకం కావాలని కోరారు. హంతకులను శిక్షించే దాకా సమాజం ఊరుకోదని హెచ్చరించారు. అప్పుడే పుట్టిన పసిపాపకు కుల, మతాలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. పుట్టిన 5 నిమిషాలకు పుట్టేదే కులం, మతమని.. మనుషులు పుట్టించిన కులం పేరుతో దేవుని దర్శనాలకు రాకుండా ఎలా చేస్తారని మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ కుటుంబంలో జరిగితే పోలీసులు ఇలాగే స్పందిస్తారా..? అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement