క్రీడల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం
వనపర్తి: తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుదామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సీఎం కప్ 2వ ఎడిషన్ రాష్ట్రస్థాయి సెపక్తక్రా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరై జ్యోతి వెలిగించి రాష్ట్ర, క్రీడా పతకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ఫాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. పోటీల్లో అతిథ్య వనపర్తితో పాటు హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, మేడ్చల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వరంగల్ తదితర జిల్లాల జట్లు పాల్గొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మందికిపైగా మహిళ, పురుష క్రీడాకారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లక్ష్యమని, ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు బడ్జెట్లో రూ.700 కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాస్మొటిక్, మెస్ చార్జీలు కూడా తమ ప్రభుత్వ హయాంలోనే పెంచినట్లు గుర్తు చేశారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి జాతీయస్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. క్రీడాకారులు తమకు నచ్చిన క్రీడలపై దృష్టి సారించి ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీయడమే సీఎం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమన్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సెపక్తక్రా ఆసక్తికర క్రీడని.. బాగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అంతర్జాతీయ స్థాయిలో రాణించిన హరిప్రసాద్ అనే క్రీడాకారుడిని సన్మానించారు. అనంతరం ప్రారంభమైన పోటీలను తిలకించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వ్యవసాయ మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, సెపక్తక్రా రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తలపడుతున్న
క్రీడాకారులు
క్రీడల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం


