● మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా పార్వతీపురం వైద్యుడు ఉమాకాంత్
పార్వతీపురం రూరల్: ఆంధ్ర ఫిజియో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గుంటూరులోని డీఎస్ఏ, ఎంఎస్కే మైదానాల్లో ఐదు రోజుల పాటు జరిగిన ’ఆంధ్ర ఫిజియో క్రికెట్ లీగ్ టీ20 (సీజన్–1)’లో గుంటూరుకు చెందిన హంగ్రీ చీతాస్ జట్టు విజేతగా నిలిచింది. రెండు రాష్ట్రాలకు చెందిన పది ఫిజియోథెరపీ డాక్టర్ల జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో 33 బంతుల్లో 59 పరుగులు చేసిన హంగ్రీ చీతాస్ ఆటగాడు, పార్వతీపురం వాసి డాక్టర్ జీరు ఉమాకాంత్ రెడ్డి ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యారు. ఈయన పార్వతీపురం జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్యాధికారి డాక్టర్ జీరు నగేష్ రెడ్డి చిన్న కుమారుడు. గతంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పలు క్రికెట్ పోటీల్లో పాల్గొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించారు. టోర్నీకి స్పాన్సర్లుగా వ్యవహరించిన గుంటూరు చంద్ర హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రవితేజ చేతుల మీదుగా విజేత జట్టుకు ట్రోఫీ, నగదు బహుమతి అందజేశారు.


