తెర్లాం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) ప్రసవాలు ఎక్కువగా జరిగేలా వైద్యులు, సిబ్బంది చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్ జీవన్రాణి అన్నారు. ఈ మేరకు మండలంలోని తెర్లాం, పెరుమాళి పీహెచ్సీలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తెర్లాం పీహెచ్సీలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై పలువురు రోగులను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీకి సంబంధించిన రికార్డులను, ల్యాబ్లో అందిస్తున్న సేవలను తనిఖీ చేశారు. ప్రతినెలా ఎంతమంది గర్భిణులకు ప్రసవాలు చేయిస్తున్నారని పీహెచ్సీ డాక్టర్లు రెడ్డి స్వాతి, వంశీలను అడిగారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ పీహెచ్సీలో ప్రతీ గర్భిణి తప్పనిసరిగా ప్రసవం చేయించుకునేలా వారికి వైద్య అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెరుమాళి పీహెచ్సీకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. రోగులకు, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కేన్సర్ వ్యాధి నివారణ వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యులు డాక్టర్ వెంకటేశ్, మనోజ్ఞరమణిలను ఆదేశించారు. యోగా డే విజయంతమైయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని, సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది యోగా డేలో పాల్గొనేలా చూడాలని పెరుమాళి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శ్రీనివాస్కు సూచించారు. పీహెచ్సీలో గల ల్యాబ్ ద్వారా చేస్తున్న పరీక్షలపై ల్యాబ్ టెక్నిషియన్ శివను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన్ రాణి


