● లక్ష్యాలు చేరుకోకపోతే కఠిన చర్యలు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, బూత్స్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో పురోగతిసాధించకపోవడం, రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లా వెనుకబడడంపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న ఇంటింటి ఓటర్ల సర్వేకు ముందే మ్యాపింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా 2002నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత 2025 ఓటర్ల జాబితాతో కచ్చితంగా మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నిక విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు.
● రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద ఉన్న ఏపీఐఐసీ పరిధిలోని 64.67 ఎకరాల భూమిని రాధిక వెజిటబుల్ ఆయిల్స్ కంపెనీకి రిజిస్టర్ చేసి అప్పగించినట్లు పరిశ్రమలశాఖ సమీక్షా సమావేశంలో కలెక్టర్ తెలియజేశారు. సమావేశంలో పరిశ్రమ శాఖ మేనేజర్ కరుణాకర్, విజయనగరం ఆర్డీఓ సుధాసాగర్, చీపురుపల్లి ఆర్డీఓ సుధారాణి, ఏపీఐఐసీ లైజన్ అధికారి సత్యనారాయణతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు


