ప్రజలను మోసం చేసే దగాకోరు పాలన మాకొద్దు.. కర్షక, కార్మిక, నిరుద్యోగ, ఉద్యోగ, మహిళ, విద్యార్థి లోకాన్ని వంచిస్తున్న చంద్రబాబు సర్కారును గద్దెదించుతాం అంటూ జనం నినదించారు. ఎస్.కోట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉచిత గ్యాస్ ఉత్తుత్తి గ్యాస్గా మార్చేశారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు మంగళం పాడేశారని విమర్శించారు. చంద్రబాబు రెండేళ్లుగా సాగిస్తున్న వెన్నుపోటు పాలన తీరును ఎస్.కోట, వేపాడ, కొత్తవలస, ఎల్.కోట, జామి మండలాల పార్టీ నేతలు మోపాడు కుమార్, మమ్ములూరు జగ్గుబాబు, గుమ్మడి సత్యనారాయణ, మాజీ జెడ్పీ చైర్పర్సన శోభ స్వాతిరాణి, తదితరులు ఎండగట్టారు. మేనిఫెస్టో ప్రతులు, ప్రజలకిచ్చిన హామీల బాండ్లను దహనం చేశారు.


