విజయనగరం అర్బన్: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో (జోన్–1 పరిధిలో) వివిధ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి విజయనగరం జిల్లా సమన్వయ అధికారి ఎం.మాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ సీట్ల భర్తీకి సంబంధించి ఈ నెల 8న జిల్లాలోని చీపురుపల్లిలో గల డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
తరగతుల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు ఇలా..
5వ తరగతి ప్రవేశాల్లో బాలుర పాఠశాలల్లో 255 సీట్లు, బాలికల పాఠశాలల్లో 341 సీట్లు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ప్రవేశాల్లో భాగంగా బాలుర కళాశాలల్లో 224 సీట్లు, బాలికల కళాశాలల్లో 202 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బ్యాక్లాగ్ సీట్లుగా 6వ తరగతి బాలుర పాఠశాలల్లో 162, బాలికల పాఠశాలల్లో 169 ఖాళీలు ఉన్నాయి. 7వ తరగతిలో బాలుర పాఠశాలల్లో 47 సీట్లు, బాలికల పాఠశాలల్లో 86, 8వ తరగతి బాలుర పాఠశాలల్లో 19, బాలికల పాఠశాల్లో 84, 9వ తరగతి బాలుర పాఠశాలల్లో 45, బాలికల పాఠశాలల్లో 9 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. సీట్లు అన్నీ కేవలం ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు మాత్రమే అని, అర్హత ఆసక్తిగల విద్యార్ధులు తమకు సంబంధించిన అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో ఈ నెల 8న చీపురుపల్లిలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల కౌన్సెలింగ్ కేంద్రానికి నేరుగా హాజరుకావాలని ఆమె కోరారు.


