● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
రేగిడి: వెన్నుపోటు పదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామాగా నిలిచారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విమర్శించారు. చంద్రబాబు ప్రభు త్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటుపొడిచారన్నారు. రేగిడి మండలం లక్ష్మీపురంలో ఓ కార్యక్రమానికి బుధవారం హాజరైన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సూపర్సిక్స్లో ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని, రాష్ట్రంలో ప్రజలను మోసగించారని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టారని, రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అటకెక్కిందని, ఫీజు రీయింబర్స్మెంట్ను అందజేయడంలేదని, 50 సంవత్సరాలకే పింఛన్ హామీ ఎండమావిగా మారిందని, కార్పొరేషన్ రుణాల మంజూరు జాడ కనిపించడంలేదని ఆరోపించారు. మహానాడు పేరుతో చంద్రబాబు సభలు పెట్టుకోవడమే తప్ప రెండేళ్లలో రాష్ట్రానికి, ప్రజలకు చేసిన మేలు శూన్యమన్నారు. రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మాత్రం రోజురోజుకూ పెంచుతున్నారన్నారు. అమరావతి పేరుతో అప్పులుచేసి కమీషన్ల రూపంలో లూటీ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబునాయుడు రెండేళ్ల మోసకారి పాలనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినాలుగా చేస్తుందని, అన్ని గ్రామాల్లోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట పోలేటి వెలమ కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ కింజరాపు సురేష్, ఎంపీటీసీ సభ్యుడు ఎర్నేన అప్పలనాయుడు, సంకిలి సొసైటీ మాజీ చైర్మన్ కెంబూరి గోపాలకృష్ణ, మాజీ సర్పంచ్లు పాడి లక్ష్మునాయుడు, కెంబూరి వెంకటేశ్వరరావు, మొయ్యి కృష్ణమూర్తినాయుడు ఉన్నారు.


