● కలెక్టర్ రాంసుందర్రెడ్డి
విజయనగరం అర్బన్:
జిల్లాలో రీ సర్వే ప్రక్రియను 2027 మార్చి నాటికి పూర్తిచేసి ప్రతి రైతుకు పూర్తి భూ వివరాలతో కూడిన పట్టాదారు పాసుపుస్తకం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రీ సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలో ఉన్న లక్షా ఏడువేల జాయింట్ ఎల్పీంలను ఈ ఏడాది జూలై 15 నాటికి సరిచేయాలని ఆదేశించారు. నాలుగో విడతలో 126 గ్రామాలు, ఐదో విడతలో 100 గ్రామాల్లో రీసర్వే పనులు పూర్తిచేయాలని పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో అందిన అర్జీలు, మ్యుటేషన్లు, 22ఏ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, డీఆర్ఓ సత్తిబాబు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


