● డీఎంహెచ్ఓ జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి అన్నారు. యాంటీ మలేరియా మాసోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే చికిత్స ప్రారంభించాలన్నారు. దోమల నియంత్రణ కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎంఓ వి.ఎస్.కె.రఘువంశీ, డీఎల్ఓ కె.రాణి, తదితరులు పాల్గొన్నారు.
నాలుగు ఆస్పత్రులకు రూ.24 లక్షల పెనాల్టీ
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని తిరుమల మెడికవర్, సాయి, గాయత్రి, నెల్లిమర్ల మిమ్స్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్వైద్య సేవ)ట్రస్టు అధికారులు రూ.24 లక్షలు పెనాల్టీ విధించారు. అవసరమైన వ్యాధి నిర్ధారణ రిపోర్టులు సరైనవి పెట్టకుండా క్లయిమ్లు పొందారనే అంశంపై పెనాల్టీలు విఽధించినట్టు సమాచారం. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులను దారిలోకి తెచ్చుకోవడం కోసం టీడీపీ సర్కార్ పెనాల్టీలు విధించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు సకాలంలో చెల్లించక పోవడంతో రెండు పర్యాయాలు సమ్మె చేపట్టారు. ఆరోగ్యశ్రీ సేవలను కూడా నిలిపివేశారు. ఇంకోసారి నెట్వర్క్ ఆస్పత్రులు గొంతు ఎత్తకుండా అణిచివేయడం కోసమే గతంలో ఎన్నడూలేని విధంగా పెనాల్టీలు విధించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు రూ. 24 లక్షలు పెనాల్టీ విధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు రావడం వాస్తవమేనని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సాయిరాం తెలిపారు.


