నెల్లిమర్ల: జిల్లాలోని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఉద్యోగుల సంఘం బలోపేతానికి చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు కోసూరు రాంబాబు అన్నారు. ఈ మేరకు నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరజాపుపేటలోని ఓ కల్యాణ మంటపంలో ఆరిపాక శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఆ సంఘం నెల్లిమర్ల నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యకలాపాలు మూడు దశాబ్దాలుగా కేవలం జిల్లా కేంద్రానికి పరిమితమయ్యాయని, ఇకనుంచి ఆ కార్యకలాపాలను జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని జిల్లా కమిటీ నిర్ణయించిందని వెల్లడించారు. తొలుత నియోజకవర్గాల స్థాయిలో కమిటీలు వేసేందుకు జిల్లా వ్యాప్త పర్యటనలు చేస్తున్నామని వివరించారు. విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ఉద్యోగులందరూ ఏకాభిప్రాయంతో, ఐక్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జనా ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెదురుపర్తి గీత సత్య ఉమాపతి, కోశాధికారి కెల్ల సోమ శేఖర్, సంఘం జిల్లా నాయకులు కుప్పిలి శ్రీనివాస్, మంతెన అప్పలరాజు, సంభాన లక్ష్మణరావు, కుప్పిలి మోహన్ బాబు, పట్నాల బాలసుబ్రహ్మణ్యం, చంద్రమౌళి, తాతాచారి, నెల్లిమర్ల నాయకులు ఆరిపాక శ్రీనివాసరావు, కృష్ణమాచారి, కడలి ప్రకాశరావు, సత్య సాయి గణేష్,ఆరిపాక రాము, బాబు విశ్వేశ్వరరావు, కడలి రమేష్ కుమార్, కొమ్మోజు సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
సంఘం జిల్లా అధ్యక్షుడు కోసూరు రాంబాబు


