● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు
పతివాడ, రాయుడుపేట గ్రామస్తుల వినతి
విజయనగరం: తమ గ్రామ ప్రజలకు జీవనాధారంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ముత్యాలమ్మ కొండను అక్రమ తవ్వకాల నుంచి కాపాడాలని పూసపాటిరేగ మండలం పతివాడ, రాయుడుపేట గ్రామస్తులు కోరారు. విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలోని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావును శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్వే నంబర్ 77లో ఉన్న ముత్యాలమ్మ కొండపై ఏటా అమ్మవారి పండగను నిర్వహిస్తామన్నారు. పశువులు, జీవాల మేతకు కొండే ఆధారమన్నారు. ఇప్పుడు కొందరు కాంట్రాక్టర్లు కొండను యంత్రాలతో తవ్వేసి కనుమరుగుచేస్తున్నారని, తక్షణమే స్పందించి తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.


