మక్కువ: మండలంలోని నగుళ్లుదబ్బగడ్డ నీలాటిరేవు సమీపంలో ఏనుగుల గుంపుమ సంచరిస్తోంది. శుక్రవారం సాయంత్రం లోవరకండి సమీపంలో సంచరించిన ఏనుగులు శనివారం ఉదయానికి నగుళ్లుదబ్బగడ్డ సమీపంలోని రామకృష్ణ అనే రైతు పామాయిల్ తోటలోకి ప్రవేశించాయని ఫారెస్ట్ ఆఫీసర్ తవిటినాయుడు తెలిపారు. పామాయిల్ తోటలోని వాటర్ ట్యాంక్ను, పైపులను .. అలాగే నగుళ్ల గ్రామంలో జానకమ్మకు చెందిన మొక్కజొన్న పంటను ఏనుగులు ధ్వంసం చేశాయని చెప్పారు. దీంతో కోన, గోపాలపురం, నగుళ్లుదబ్బగడ్డ, డి.శిర్లాం, లోవరఖండి, తదితర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ తవిటినాయుడు తెలిపారు.
వేర్వేరు చోరీ కేసుల్లో
ముగ్గురి అరెస్ట్
● సుమారు 22 తులాల బంగారం రికవరీ
విజయనగరం క్రైమ్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన మూడు చోరీలకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు వేర్వేరుగా శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక డీపీఓలోని కాన్ఫరెన్స్ హాల్లో బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు, విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ రాఘవులతో కలిసి ఎస్పీ ఏఆర్ దామోదర్ నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. బొబ్బిలి, రామభద్రపురంలలో ఫ్లిప్కార్డ్ ఉద్యోగిగా పని చేస్తున్న మణికంఠ ఇంటింటికీ వెళుతూ పగలు పూట రెక్కి నిర్వహించి రాత్రి పూట దొంగతనాలకు పాల్పడేవాడని ఎస్పీ తెలిపారు. అతని నుంచి దాదాపు 20 తులాల బంగారం రికవరీ చేశామన్నారు. ఇక ఎస్. కోట పీఎస్ పరిధిలో రవి అనే వ్యక్తి జులాయిగా తిరుగుతూ మధ్యానికి బానిసై డబ్బుల కోసం దొంగతనాలు చేసేవాడని, అతని వద్ద నుంచి సుమారు మూడు తులాల బంగారం రికవరీ చేశామన్నారు. అలాగే భోగాపురం పీఎస్ పరిధిలో ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. సమావేశంలో ఎస్. కోట సీఐ నారాయణ, బొబ్బిలి సీఐ మూర్తి, భోగాపురం ఎస్సై అనిల్, తదితరులు పాల్గొన్నారు.


