పూసపాటిరేగ:
భోగాపురం గ్రామంలో ప్రభుత్వం నిర్వహించే రీ సర్వేను బాధిత రైతులు స్వచ్ఛందంగా బహిష్కరించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ ఎస్.సుధాసాగర్ భోగాపురం తహసీల్దార్ కార్యాలయానికి హుటాహుటిని చేరుకొని రీసర్వేపై తహసీల్దార్ హరితో చర్చించారు. భోగాపురంలో నిలిపివేసిన భూసర్వేపై అధికారులతో సమాలోచన చేశారు. అనంతరం పోలిపల్లికి చెందిన పలువురు బాధిత రైతులతో తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడారు. భోగాపురం మండలంలో రిలియన్స్ డేటాసెంటర్ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు కోరారు.
రైతుల సమ్మతి లేకుండా, కనీసం సమాచారం లేకుండా జీఓ ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. తరతరాలుగా జీవనాధారమైన భూమిని ప్రైవేటు సంస్థకు ధారాదత్తం చేయడానికి ప్రయత్నించడంపై నిలదీశారు. రిలయన్స్ డేటా సెంటర్ ఇచ్చిన జీఓను ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలన్నారు. అనంతరం భోగాపురం తహసీల్దార్ కార్యాలయం నుంచి శిబిరం వద్దకు బాధిత రైతులను కలవడానికి బయలుదేరిన ఆర్డీఓ అక్కడకు వెళ్లకుండానే భోగాపురంలో రీసర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అక్కడ రైతులు ఎవరూ లేకపోవడంతో వెళ్లి పోయారు. ఆయన వెంట తహసీల్దార్ హరి, ఆర్ఎస్డీటీ రవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ, తదితరులు ఉన్నారు.
డేటా సెంటర్కు ఇచ్చిన జీఓ రద్దుచేసిన తరువాతే సర్వే చేయాలి
ఆర్డీఓను కలవాలని ప్రయత్నించిన బాధిత రైతులు
నిరసన శిబిరం వద్దకు రాకుండానే వెళ్లిపోయిన ఆర్డీఓ


