విజయనగరం అర్బన్: స్థానిక సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (సీతం) ఇంజినీరింగ్ కళాశాల జాతీయ స్థాయిలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. సీఎస్ఈ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.దినేష్కుమార్ భాగస్వామ్యంతో రూపొందించిన ఒక వినూత్న ఎమ్మార్ఐ స్కానింగ్ పరికరం డిజైన్కు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం అధికారికంగా ‘డిజైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (పేటెంట్) మంజూరు చేసింది. ఈ సందర్భంగా సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు శుక్రవారం మాట్లాడుతూ.. కళాశాలలో పరిశోధన, సరికొత్త ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి ఇటువంటి జాతీయ స్థాయి విజయాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు, పరిశోధనలకు సంస్థ తరఫున మద్దతిస్తామని చెప్పారు. అనంతరం డాక్టర్ దినేష్కుమార్ను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో డీన్ అకాడమిక్ డైరెక్టర్ వై.నరేంద్రకుమార్, చీఫ్ అకడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సాయిరాం పట్నాయక్, ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్.సతీష్కుమార్, సివిల్ హెచ్ఓడీ డాక్టర్ రవికిషోర్, తదితర అధ్యాపక సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు.


