● వీసీడీఎల్ డైరెక్టర్ కండాపు ప్రసాదరావు
రాజాం: తమ బ్యాంక్ కొత్తగా ఎనిమిది శాఖలను ఏర్పాటు చేయనుందని విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కండాపు ప్రసాదరావు అన్నారు. పట్టణ కేంద్రంలోని సూర్యచంద్ర ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన స్థానిక బ్రాంచ్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ బ్యాంక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 శాఖలతో సేవలు అందిస్తోందని గుర్తుచేశారు. మరణించిన 1006 మంది ఖాతాదారుల కుటుంబాలకు రూ. 255 లక్షల మొత్తాన్ని పంపిణీ చేశామన్నారు. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రామకృష్ణారావు మాట్లాడుతూ.. ప్రైవేట్ రంగంలో ఉన్న కొన్ని మోసపూరిత ఆర్థిక సంస్థలో పెట్టుబడులు పెట్టవద్దని, అలాగే రుణాలు తీసుకోవద్దని సూచించారు. తమ బ్యాంక్ ప్రజల బ్యాంక్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. అనంతరం ఉత్తమ ఖాతాదారులుగా ఎంపికై న వాండ్రంగి కొండలరావు, తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో బ్యాంక్ జోనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాసరావు, బ్రాంచ్ మేనేజర్ ఎం.దీప్తి, డైరెక్టర్లు పాల్గొన్నారు.


