విజయనగరం అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓ) అందజేసే ప్రత్యేక కిట్లను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి గురువారం తన చాంబర్లో పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు జిల్లా వ్యాప్తంగా ఇంటింటినీ సందర్శించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సర్వే సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా అధికారులకు అవసరమైన అన్ని వస్తువులతో కూడిన కిట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
బ్యాగులో గొడుగు, వాటర్ బాటిల్
ఎండలు, వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించే బీఎల్ఓల సౌకర్యార్థం ఈ కిట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక ఆకర్షణీయమైన బ్యాగులో అవసరమైన స్టేసనరీ సామగ్రితోపాటు ఒక గొడుగు, వాటర్ బాటిల్ను కూడా ఉంచి అందజేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,847 మంది బీఎల్ఓలకు ఈ కిట్లను శుక్రవారం నుంచి పంపిణీ చేయాలని డీర్ఓకు ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
జూన్ 15 నుంచి జూలై 14 వరకు
ఇంటింటి సర్వే
స్టేషనరీతో పాటు గొడుగు, వాటర్ బాటిల్స్ పంపిణీ
జిల్లాలోని 1,847 మంది బీఎల్ఓలకు నేటి నుంచి కిట్ల అందజేత


