చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని ఎం.దుగ్గివలస గ్రామంలో విద్యుత్శాఖ నిర్లక్ష్యం కారణంగా ఓ ఎనర్జీ అసిస్టెంటుకు విద్యుత్ షాక్ తగిలింది. గ్రామంలో 11కేవీ విద్యుత్ లైన్ను తాకి ఉన్న కర్రను తొలగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయకుండా గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఎనర్జీ అసిస్టెంటు పనులు చేపట్టాడు.. కర్రకు నీటి తడి ఉండడంతో విద్యుత్ వైర్లుకు తగిలిన వెంటనే కరెంటు ప్రవహించి ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో మందిరవలస సచివాలయ పరిధిలో ఎనర్జీ అసిస్టెంటుగా పని చేస్తున్న మెరకముడిదాం మండలంలోని గాతాడ గ్రామానికి చెందిన జి.రాము తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి ఎడమ చేయి మోచేతి భాగం కాలిపోగా ఎడమ కాలుకు గాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం రిఫర్ చేశారు. ఇదిలా ఉండగా విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని షిఫ్ట్ ఆపరేటర్కు సమాచారం అందించానని, తరువాతనే ఎనర్జీ అసిస్టెంటుతో పనులు చేయించానని, విద్యుత్ సరఫరాను ఆఫ్ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని లైన్మన్ శంకరరావు చెబుతున్నాడు. ఏది ఏమైనా విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా పనులు చేపట్టడం, ముందస్తు జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంలో విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.


