● మంచం పట్టిన చిన్నారులు, మహిళలు
● ప్రైవేటు వైద్యుల వద్ద చికిత్స
పొందుతున్న జ్వరపీడితులు
తెర్లాం: మండలంలోని పూనువలస పంచాయతీ పరిధిలోని జె.కొత్తవలస గ్రామస్తులను జ్వరాలు వణికిస్తున్నాయి. కొన్ని రోజులుగా టైఫాయిడ్, మలేరియా, వైరల్ జ్వరాలు సోకడంతో పలువురు మంచం పట్టారు. అనుపోతుల చరణ్, రఘు, జాడ నీలవేణి, అనుపోతుల చిన్న తదితరులు రాజాంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లోను, ఆర్ఎంపీల వద్ద వైద్యసేవలు పొందుతున్నారు. గ్రామంలో జ్వరాల వ్యాప్తి విషయాన్ని తెలుసుకున్న పెరుమాళి పీహెచ్సీ వైద్యుడు వెంకటేష్, ఆయుర్వేద వైద్యుడు శ్రీనివాసరావు సిబ్బందితో బుధవారం గ్రామానికి వచ్చి వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరాలతో అస్వస్థతకు గురైన వారికి వైద్యపరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు.


