వడదెబ్బతో ఉపాధి వేతనదారు మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఉపాధి వేతనదారు మృతి

May 27 2026 10:20 AM | Updated on May 27 2026 10:20 AM

వడదెబ్బతో ఉపాధి వేతనదారు మృతి

గంట్యాడ: మండలంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటూ పొల్లంగి గ్రామానికి చెందిన సిరివురు సన్యాసిరాజు హఠాత్తుగా మృతి చెందడం విషాదం కలిగించింది. పనిస్థలాల్లో టెంట్లు, తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ వంటి కనీస సదుపాయాలు కల్పించకుండా కార్మికులతో పనులు చేయిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వడదెబ్బతో కూలీ..

లక్కవరపుకోట: మండలంలోని రెల్లిగౌరమ్మపేట గ్రామం సమీపంలో గల మాహామాయ కర్మాగారంలో రోజు వారి కూలి పనులు చేసేందుకు వచ్చిన మెరకమొడిదాం మండలానికి చెందిన దిబ్బరాజు (50) అనేకూలీ వడదెబ్బకు గురై మృత్యవాత పడ్డాడు. దిబ్బరాజు కొద్ది రోజులుగా ఒక కాంట్రాక్టర్‌ వద్ద కూలి పనులకు చేరాడు.మంగళవారం అధిక ఎండ కావడంతో కర్మాగారం గేటు బయటకు వచ్చి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయి మృత్యుఒడిలోకి చేరాడు. ఆటుగా వెళ్లేవారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో వెళ్లి పరిశీలించి మృతి చెందినట్లు గుర్తించి మృతదేహాన్ని ఎస్‌.కోట సీహెచ్‌సీ మార్చురీకి తరలించి మృతుడి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

చందులూరులో గుర్తు తెలియని మృతదేహం..

లక్కవరపుకోట: మండలంలోని చందులూరు గ్రామం శివారులో గుర్తు తెలియని సుమారు 40 సంవత్సరాలు వయస్సు గల యువకుడి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. రెండు రోజులుగా గ్రామంలో తిరుగుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ రామకృష్ణ మృతదేహం వద్దకు చేరుకుని పరిశీలించారు. మృతుడి శరీరంపై ఫ్యాంట్‌ మాత్రమే ఉందని షర్టు లేదని తెలిపారు. మృతుడి వీపు భాగంలో తుప్పలు గీసుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వడదెబ్బకు గురై మృతి చెంది ఉంటాడని ఎస్సై భావించారు. ఈ మేరకు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఫోన్‌ 9121109450 ,9494166167 నంబర్లకు తెలపాలని ఎస్సై కోరారు.

పాము కాటుతో మహిళ..

గంట్యాడ: మండలంలోని మోకాలుపాడు గ్రామానికి చెందిన గుణశెట్టి లక్ష్మి పాము కాటుతో చికిత్స పొందుతూ మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఈనెల 20వ తేదీ రాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో ఆమె కుడికాలి వేళ్లను పాము కాటేసింది. వెంటనే కుటుంబసభ్యులు 108 అంబలెన్స్‌ ద్వారా విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి కుమారుడు శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంట్యాడ ఏఎస్సై రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement