
ఎందరో సమరయోధుల త్యాగఫలం స్వాతంత్య్రం
● ఏపీఎస్పీ కమాండెంట్ మలికా గార్గ్
డెంకాడ: ఎందరో సమరయోధుల త్యాగఫలం స్వాతంత్య్రమని చింతలవలస ఐదవ ఏపీఎస్పీ కమాండెంట్ మలికా గార్గ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్లో శుక్రవారం జాతీయ జెండాను కమాండెంట్ మలికా గార్గ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వందల ఏళ్ల పాటు బ్రిటిష్ బానిసత్వం నుంచి భారతదేశం 1947 సంవత్సరం ఆగస్టు 15న విముక్తి పొందిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను వృథా కానివ్వరాదన్నారు. ఉత్తమ సేవలు కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రసంశా పత్రాలను అందేశారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు జి.లక్ష్మీనారాయణ, ఎస్.బాపూజీ, డీవీ రమణమూర్తి, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
కొమరాడ: కొమరాడ మండలం విక్రంపురం గ్రామానికి చెందిన వుబ్బిశెట్టి చిట్టిబాబు(62) విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్ఐ నీలకంఠం తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు.. వుబ్బిశెట్టి చిట్టిబాబు తాపీ మేస్త్రిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం వర్షం కారణంగా పనిలేక వెళ్లలేదు. తన ఇంటి బయట విద్యుత్ వైర్ వేలాడుతుండగా ప్రమాదవశాత్తు తగిలి షాక్ గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
అనుమానాస్పదంగా
ఎలక్ట్రీషియన్ మృతి
పెందుర్తి: భార్యతో గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన పెందుర్తిలో చోటు చేసుకుంది. సీఐ కేవీ సతీష్కుమార్ తెలిపిన వివరాలు.. పెందుర్తి నటరాజ్ థియేటర్ సమీపంలోని నేల బావిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. దీనిపై స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సీఐ సతీష్కుమార్ ఆధ్వర్యంలోని పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మృతుడు విజయనగరం జిల్లా జామి మండలం మామిడిపల్లికి చెందిన రావురు ప్రసాద్(25)గా గుర్తించినట్లు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం మేరకు కొన్నాళ్లుగా భార్యతో వివాదాల కారణంగా తల్లితో స్వగ్రామంలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్ అయిన ప్రసాద్ మూడు రోజుల క్రితం పని మీద వెళుతున్నానని తల్లికి చెప్పి, తిరిగి ఇంటికి రాలేదన్నారు. ఈ క్రమంలో ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా? మరేదైనా కారణంతో మృతి చెందాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఎందరో సమరయోధుల త్యాగఫలం స్వాతంత్య్రం