అల్లిపురం: నూతన జిల్లా న్యాయమూర్తి జి. శ్రీనివాస్ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో జీవీఎంసీకి సంబంధించిన పెండింగ్ రెవెన్యూ, ఆర్థిక కేసుల పరిష్కారంపై చర్చించారు.ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, ట్రేడ్ లైసెన్సులు, నీటి చార్జీలు, ప్రకటనల చార్జీలకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. పెండింగ్ కేసులను ముందుగానే గుర్తించి సంబంధిత వ్యక్తులు, సంస్థలకు సమాచారం అందించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.లోక్ అదాలత్కు హాజరయ్యే ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని, కేసుల పరిష్కారం అనంతరం బకాయిల చెల్లింపులకు 12 ప్రత్యేక క్యాష్ కౌంటర్లు, యూపీఐ చెల్లింపు సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.


