మెగా పేరెంట్స్– టీచర్స్ మీటింగ్ 4.0
నిర్వహణకు అరకొర నిధులు
సొంత డబ్బు ఖర్చు చేయాల్సిన దుస్థితిలో
ప్రధానోపాధ్యాయులు
ప్రభుత్వ సమావేశానికి ఉపాధ్యాయుల
జేబులకు చిల్లు
ఆరిలోవ: పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం) పేరు చెప్పగానే ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల గుండెల్లో గుబులు మొదలవుతోంది. మీటింగ్ నిర్వహిస్తే జేబులు గుల్ల అవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వమిచ్చే చాలీచాలని నిధులతో సమావేశం ఎలా నిర్వహించాలని హెచ్ఎంలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో శుక్రవారం మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 4.0 నిర్వహించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేపట్టారు.
594 పాఠశాలలు..
78,526 మంది విద్యార్థులు
జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన 594 పాఠశాలలు, 11 జూనియర్ కళాశాలల్లో పీటీఎం నిర్వహించనున్నారు. వీటిలో మొత్తం 78,526 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే ఇవి అరకొరగానే ఉండటం గమనార్హం. అయినప్పటికీ అట్టహాసంగా పీటీఎం నిర్వహించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యాశాఖ ఇచ్చే నిధులు చాలక సొంత జేబులో డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏ పాఠశాలకు ఎంతెంత నిధులు
మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కోసం విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలకు నిధులు మంజూరు చేశారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అదే సంఖ్యలో హాజరుకానున్నారు.
ఈ లెక్క ప్రకారం జిల్లాలోనే అతిపెద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిన మధురవాడ ప్రాంతంలోని చంద్రంపాలెం హైస్కూల్లో 2,911 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలకు కూడా కేవలం రూ.9 వేలు మాత్రమే మంజూరు చేశారు. అలాగే 1,308 మంది విద్యార్థులున్న తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కూడా రూ.9 వేలు మాత్రమే దక్కింది. ఆయా పాఠశాలల్లో కార్యక్రమం ఏర్పాటుకు టెంట్లు, కుర్చీలు, టీ, స్నాక్స్, అతిథి మర్యాదలతో కలిపి కనీసం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతుందని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.9 వేలు అదనంగా సొంత జేబు నుంచి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు హెచ్ఎంలు ఖర్చు చేయాల్సిందేనని వాపోతున్నారు.
విద్యార్థుల సంఖ్య మంజూరైన నిధులు
0–30 మంది రూ.900
31–100 మంది రూ.2,250
101–250 మంది రూ.4,500
251–1,000 మంది రూ.6,750
1,000 మందికి పైగా రూ.9,000


