ప్రభుత్వ ఆదాయానికి గండి
మహారాణిపేట: దస్తావేజు లేఖర్ల నిరవధిక పెన్డౌన్తో జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తీవ్రంగా దెబ్బతింటోంది. భూములు, స్థలాలు, అపార్ట్మెంట్ల క్రయవిక్రయాలకు అవసరమైన దస్తావేజుల తయారీ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, దస్తావేజు లేఖర్ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సేవలు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. పెన్డౌన్ ప్రభావంతో నిత్యం రద్దీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా కేవలం 144 డాక్యుమెంట్లు మాత్రమే నమోదు కాగా, వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.1.35 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణ రోజులతో పోలిస్తే చాలా తక్కువని అధికారులు చెబుతున్నారు.
నాలుగో రోజుకు చేరిన పెన్డౌన్
జీవో 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖర్ల సంఘం నాయకుడు మజ్జి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం సూపర్బజార్ ఆవరణలోని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు ఆందోళన చేపట్టారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆందోళన కొనసాగుతుందని మురళీకృష్ణ తెలిపారు. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేషన్ల శాఖను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లడం సరికాదన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్లు నాలుగో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి పెన్డౌన్లో పాల్గొంటూ తమ నిరసనను వ్యక్తం చేశారు.


