పెదగంట్యాడ: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన సాంకేతికత అని, దానిని సక్రమంగా వినియోగిస్తే మానవ ప్రగతికి గొప్ప సాధనంగా మారుతుందని మహేంద్ర యూనివర్సిటీ డిజిటల్ మీడియా విభాగం ప్రొఫెసర్ కె.వి.కూర్మనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నడుపూరులో నిర్వహించిన ఏఐ వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయులకు ఏఐ వినియోగంపై అవగాహన కల్పించారు. తరగతి బోధన, లెసన్ ప్లాన్లు, ప్రశ్నాపత్రాల రూపకల్పన, క్విజ్లు, మూల్యాంకనం తదితర విద్యా కార్యక్రమాల్లో ఏఐను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని వివరించారు. భవిష్యత్ తరాలకు ఏఐపై సరైన అవగాహన కల్పించడం ఉపాధ్యాయుల బాధ్యత అని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలకు చెందిన 70 మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ వర్క్షాప్కు రాచకొండ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఏపీటీఎఫ్ నాయకులు జగన్మోహన్, దుర్గాప్రసాద్, వై. శ్రీనివాసరావు, బి. వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు.


