ఎంవీపీ కాలనీ : నగరంలోని మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొండేపు రాజేష్ (34) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే న్యూ కాలనీకి చెందిన రాజేష్ వృత్తిరీత్యా ఈవెంట్ ఆర్గనైజర్. చిప్పాడ గ్రామంలో ఒక ఈవెంట్ నిర్వహించేందుకు తన స్నేహితుడితో కలిసి బైక్పై ఇసుకతోట వైపు బయలుదేరారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆటోమోటివ్ సిగ్నల్ దాటిన తర్వాత, వారి ముందు వెళ్తున్న ఒక మహిళా వాహనదారురాలు ఆకస్మాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో రాజేష్ కూడా వెంటనే బ్రేక్ వేయగా, వాహనం అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ కిందకు దూసుకెళ్లింది. ట్యాంకర్ వెనుక చక్రాలు రాజేష్ పైనుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్ వెనుక కూర్చున్న అతని స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎంవీపీకాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతివేగం, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


