మురళీనగర్: జిల్లాలో ఈ నెల 25న నిర్వహించనున్న పాలిసెట్–2026కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కో ఆర్డినేటర్ కేవీ రమణ తెలిపారు. సోమవారం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని 18 కేంద్రాల్లో 6,308 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణలో కొత్తగా ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ వినియోగంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిశీలకుడు డాక్టర్ బెహరా శ్రీనివాస్ ఆన్లైన్ ద్వారా పాల్గొని పలు సూచనలు చేయగా, సహాయ సమన్వయకర్త పి.ఎం. బాషా పరీక్షల నిర్వహణ వివరాలను వివరించారు. అనివార్య కారణాల వల్ల ఎన్ఏడీలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీ కేంద్రాన్ని రద్దు చేసి, దానికి బదులుగా ఎన్ఏడీలోని నారాయణ ఇంగ్లీషు మీడియం హైస్కూల్ (హాల్ టికెట్ నంబర్లు 1801001 నుంచి 1801300 వరకు), శ్రీ చైతన్య ఇంగ్లీషు మీడియం స్కూల్ (హాల్ టికెట్ నంబర్లు 1801301 నుంచి 1801400 వరకు) పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు రమణ చెప్పారు. గతంలో ఎస్ఆర్ కాలేజీకి కేటాయించిన 400 మంది విద్యార్థులు తమ హాల్ టికెట్లను తిరిగి డౌన్లోడ్ చేసుకోవాలని, మారిన వివరాలను అభ్యర్థులకు ఫోన్ ద్వారా కూడా సమాచారం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఎన్ఏడీ పరీక్ష కేంద్రంలో స్వల్పమార్పు


