విశాఖ స్పోర్ట్స్: విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్(వీడీసీఏ) ఆధ్వర్యంలో జరిగిన టీ20 టోర్నమెంట్ విజేతగా గెలాక్సీ సీసీ నిలిచింది. ఆదివారం వైఎస్సార్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కావలీర్స్ సీసీపై గెలాక్సీ సీసీ 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన గెలాక్సీ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. బ్యాటర్ మునిమ్ 52 పరుగులతో రాణించగా, కావలీర్స్ బౌలర్ భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కావలీర్స్ సీసీ.. గెలాక్సీ బౌలర్ల ధాటికి 17.3 ఓవర్లలో కేవలం 124 పరుగులకే కుప్పకూలింది. గెలాక్సీ బౌలర్లలో వాసు నాలుగు వికెట్లు, హేమంత్ మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టోర్నీ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మునిమ్ బెస్ట్ బ్యాటర్గా, ఆశిష్ బెస్ట్ బౌలర్గా, మోహిత్ బెస్ట్ ఆల్రౌండర్గా నిలిచారు. విజేతగా నిలిచిన గెలాక్సీ జట్టుకు రూ.25 వేలు, రన్నరప్ కావలీర్స్కు రూ.15 వేలు, మూడో స్థానంలో నిలిచిన మెట్రో జట్టుకు రూ.10 వేల నగదు బహుమతులను వీడీసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణుకుమార్ రాజు చేతుల మీదుగా అందజేశారు.


