జోన్–1 పంచాయతీ అభివృద్ధి అధికారుల డిమాండ్
ఆనందపురం: స్థానిక మండల పరిషత్ కార్యాలయం వేదికగా ఆదివారం జోన్–1 పరిధిలోని పంచాయతీ అభివృద్ధి అధికారుల(పీడీవో) ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారుల వృత్తిపరమైన సమస్యలు, పదోన్నతులు, భవిష్యత్తు కార్యాచరణపై లోతుగా చర్చించారు. జోన్–1 అధికారుల సాధికారత కోసం ఒక కోర్ కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఉత్తర్వుల అంశంపై సుదీర్ఘ చర్చ సాగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో నెం.60 వల్ల పీడీవోలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ జీవోను వెంటనే రద్దు చేసి, గతంలో ఉన్న జీవో నెం.91ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గతంలో జోన్–1 పరిధిలో పీఆర్, ఎస్జీఎస్డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీవోల పదోన్నతుల్లో సీనియర్ అసిస్టెంట్లకు అధిక ప్రాధాన్యత లభించిందని వారు గుర్తు చేశారు. సమావేశంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి అధికారులు హాజరయ్యారు.


