ఆనందపురం: మండలంలోని తర్లువాడలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కోరాడ రమణమ్మ కుటుంబ సభ్యులు వేసవి తాపం తట్టుకోలేక ఇంటికి తాళం వేసి, నిద్రించడానికి మేడ మీదకు వెళ్లారు. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న సుమారు నాలుగు తులాల బంగారు నగలు, 50 తులాల వెండి ఆభరణాలను దొంగలించారు. ఇది గమనించిన గ్రామస్తులు చాకచక్యంగా వ్యవహరించి, నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో నిందితులను మధురవాడ ప్రాంతానికి చెందిన కోలా నవీన్, తోట దుర్గాప్రసాద్లుగా గుర్తించి, దొంగలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ పాత నేరస్తులని పోలీసులు తెలిపారు. బాధితురాలు కోరాడ రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


