న్యాయం చేయాలని శ్రీకృష్ణాపురం గిరిజనుల ఆందోళన
ఆరిలోవ: జీవీఎంసీ 13వ వార్డు పరిధి ముడసర్లోవ వద్ద రైల్వే జోన్ పనులను మంగళవారం శ్రీకృష్ణాపురానికి చెందిన గిరిజనులు అడ్డుకున్నారు. ముడసర్లోవ ప్రాంతంలో 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే జోన్ కోసం కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థ భూసార పరీక్షలు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పొక్లెయిన్ ద్వారా పనులు జరగనివ్వకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఈ భూములు రైల్వేకు కేటాయించారని, వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. 1976లో అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణాపురంలో 66 గిరిజన కుటుంబాలకు 66 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించిందని వారు తెలిపారు. ఆ భూమిని ఇప్పుడు రైల్వేకు కేటాయించడం అన్యాయమన్నారు. ఈ భూములు తీసుకున్నందుకు తమకు ప్రత్యామ్నాయం చూపాలని, అప్పటివరకు పనులు జరగనివ్వమని హెచ్చరించారు.
పత్తా లేని టీడీపీ నాయకులు
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు రైల్వే అధికారులు ఈ భూములకు హద్దులు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో శ్రీకృష్ణాపురం గిరిజనులతో కలిసి టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. గిరిజనులకు ప్రత్యామ్నాయం చూపకుండా పనులు జరపకూడదని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పనులు జరుగుతుండగా టీడీపీ నాయకులు పత్తా లేకుండా పోయారు. ఇక్కడ గిరిజనులను రాజకీయంగా ఉపయోగించుకుని అవసరం తీరిన తర్వాత ముఖం చాటేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.