హెడ్ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్
● ఆర్టీసీ బస్సు కింద పడి యువకుడి మృతి
ఎంవీపీకాలనీ: మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గేదెల రాంబాబు (25) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి. ఇసుకతోట కూడలి వైపు నుంచి మద్దిలపాలెం వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న రాంబాబు.. ఆటోమోటివ్ జంక్షన్ దాటిన తర్వాత ఓ ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో అతని వాహనం అదుపుతప్పి కింద పడిపోగా, రాంబాబు ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద నలిగిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రాంబాబు హెడ్ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండటం, ఇరుకు దారిలో వాహనాలను దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాంబాబు ఢీకొన్న మరో వాహనంపై ప్రయాణిస్తున్న ఓ మహిళ కాలికి కూడా గాయాలయ్యాయి.


