అనంతగిరి: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ దీపక్ తివారి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కొడంగల్ నియోజకవర్గంలోని వ్యవసాయ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు విక్రయించాలన్నారు. ప్రభుత్వం సూచించిన ధరలకే అమ్మాలని ఆదేశించారు. ఎక్కువ ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు ఉంటాయన్నారు. నకిలీ విత్తనాల కట్టడికి జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతు బీమ, రైతు భరోసా తదితర పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. విత్తనాల పంపిణీ, నిల్వలను రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు. సన్న రకం వడ్ల సాగును ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం, వ్యవసాయ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ, విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
త్వరితగతిన పరిష్కరించాలి
ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి 133 దరఖాస్తులు స్వీకరించారు. వీటిని ఆయా శాఖలకు బదలాయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటాచారి, ఉమాశంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, డీఆర్ఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.


