కొడంగల్/అనంతగిరి: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. గురువారం కొడంగల్ మున్సిపల్ పరిధిలో పర్యటించి నిర్మాణ దశలో ఉన్న పనులను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పని చేసి పురోగతి సాధించాలని సూచించారు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు, బాలుర వసతి గృహం నిర్మాణ పనులు, స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలను సందర్శించారు. గుండ్లకుంట గ్రామంలో పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులు, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, కమిషనర్ బలరాం నాయక్ పాల్గొన్నారు.
వేగవంతంగా పూర్తి చేయాలి
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కులు, తాగునీటి సరఫరా తదితర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీల శుభ్రత, మురుగు నిల్వ కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు విక్రమ్ సింహారెడ్డి, బలరాంనాయక్, మల్లేశ్, రాకేష్ రెడ్డి, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పాల్గొన్నారు.


