మాట్లాడుతున్న ఎస్పీ స్నేహమెహ్ర
అనంతగిరి: చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా పోలీస్, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో బుధవారం కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పశువుల సంతలు, చెక్పోస్టుల వద్ద సిబ్బంది నియమించాలని ఆదేశించారు. ఆవులు, దూడలను అక్రమంగా రవాణా చేసినా.. వధించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు కొత్లాపూర్, రావులపల్లి, బషీరాబాద్ రైల్వే గేట్ వద్ద మూడు అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, అంగడి చిట్టంపల్లి, మైతాబ్ ఖాన్ గూడ, అంతారం, లక్ష్మీనారాయణపూర్ క్రాస్ రోడ్ ప్రాంతాల్లో నాలుగు అంతర్ జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టామన్నారు. పశువుల అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవన్నారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి సదానందం, అదనపు ఎస్పీ రాములు నాయక్, డీఎస్పీలు అంజయ్య, జానయ్య, శ్రీనివాస్, యాదయ్య, శ్రీనివాస్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
పశువుల అక్రమ రవాణాపై నిఘా
ఎస్పీ స్నేహ మెహ్ర


