తాండూరు టౌన్: వికారాబాద్ పట్టణంలో బుధవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాము, మధు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జంప్, త్రో, 400 మీటర్ల రన్నింగ్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ మార్క్స్ పాఠశాలలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు కుల ధ్రువీకరణ పత్రం, ఎస్సెస్సీ మెమోతో రిపోర్ట్ చేయాలన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 10న వరంగల్లో జరగనున్న అంతర్ జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో, ఈ నెల 17 హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అంతర్ జిల్లా బాలబాలికల పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. వివరాలకు సెల్ నంబర్ల 9951343432, 6300075229లో సంప్రదించాలన్నారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప
యాలాల: రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న ఆశవర్కర్ల వేతనాలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆశవర్కర్ల యూనియన్ పిలుపు మేరకు మంగళవారం పీహెచ్సీ వైద్యురాలు రూబియానాజ్కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశవర్కర్లకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలన్నారు. ఆశవర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనాన్ని అందించి, ఇతర సమస్యల పరిష్కారానికి ఎన్హెచ్ఎంలకు సరిపడా నిధులు కేటాయించాలన్నారు. గత 20 ఏళ్లుగా పేద ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆశవర్కర్ల విషయంలో ప్రభుత్వం అనుకూలంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆశవర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి శశికళ, ఆశ వర్కర్లు అనిత, వెంకటమ్మ, దస్తమ్మ తదితరులు పాల్గొన్నారు.
దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్రెడ్డి
తాండూరు రూరల్: కర్ణాటక – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కొత్లాపూర్ గ్రామ శివారులో వెలసిన ఎల్లమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ నిర్వాహకులు వినోద్రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పట్లోళ్ల ప్రవీణ్రెడ్డి, ఈఓలు శేఖర్గౌడ్, శాంతు, ఉప సర్పంచ్ రాజు, సిబ్బంది అమరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవితను కలిసిన ఫార్మా భూ బాధితులు
యాచారం: ఫార్మాసిటీ భూ బాధితులు మంగళవారం ఎమ్మెల్సీ కవితను నగరంలోని ఆమె నివాసంలో కలిశారు. గత బీఆర్ఎస్ సర్కార్ మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం బలవంతపు భూసేకరణ చేస్తోందని, 40 రోజులకు పైగా రైతులు దీక్షలు చేస్తున్నా చలనం లేదన్నారు. ఫార్మాసిటీ పేరుతో రైతుల పేర్లపై ఉన్న భూ రికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేసి, పరిహారాన్ని అథారిటీలో జమ చేసి ఆ భూములు సర్కార్వేనని భయపెట్టాలని చూస్తున్నారని వాపోయారు. దీంతో స్పందించిన ఆమె త్వరలోనే కుర్మిద్ద తండాలో గిరిజన రైతులు చేస్తున్న దీక్ష వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామా ల రైతులతో పాటు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కవుల సరస్వతి, నేనావత్ శ్రీకాంత్నాయక్, కిషన్ నాయక్ పాల్గొన్నారు.


