అనంతగిరి: ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని.. ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయిల్ పామ్ సాగు, రైతు సంక్షేమ పథకాలపై ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా ఆయిల్ పామ్ సాగుకు అధికారులు కృషి చేస్తున్నట్లు వివరించారు. రైతులు కూడా సాగు చేసేందుకు ముందుకు రావాలన్నారు. సాగుపై అవగాహన కల్పించేందుకు అశ్వరావుపేట్ ప్రాంత పర్యటనకు రైతులను తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో పాటు పండ్లు, పూలు, కూరగాయల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. జూన్ మాసంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, ఉద్యాన, పట్టు పరిశ్రమల జిల్లా అధికారి సత్తార్, మార్కెట్ కమిటీ చైర్మన్లు చాపల శ్రీనివాస్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ధాన్యం సేకరించాలి
జిల్లాలో పకడ్బందీగా ధాన్యం సేకరించాలని కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, డీఆర్డీఏ శ్రీనివాస్, డీఎస్ఓ సుదర్శన్, డీఎంసీఎస్ మోహన్ కృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, మార్కెటింగ్ ఎండీ రియాజ్, మార్క్ఫెడ్ అధికారి రేఖ, డీసీఓ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి
కలెక్టర్ దీపక్ తివారి


